అబ్దుల్లాపూర్మెట్, మే 8: ఏమైందో తెలిసే లోపు అమ్మానాన్న రక్తంతో తడిసిపోయారు. కారులో ఇరుక్కుపోయి విగతజీవులయ్యారు. చిన్నారి ఒక్కడిని ఒంటరి చేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. విజయవాడ జాతీ య రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి, అతని భార్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వారి ఏడేండ్ల కుమారుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన సుందరి లక్ష్మణ్(39) హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల కిందట లక్ష్మణ్.. భార్య జాన్సీ, కుమార్తె ఆకాంక్ష, ఏడేండ్ల కుమారుడు కుశల్తో కలిసి గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలోని అత్తగారింటికి వెళ్లారు. అక్కడ రామాలయ పునఃప్రారంభం, ధ్వజ స్తంభారోహణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నాగులపాటి అన్నారంలో తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. కుమార్తెను తల్లి వద్దే ఉంచి.. శుక్రవారం రాత్రి 10 గంటలకు జాన్సీ, కుశల్తో కలిసి లక్ష్మణ్ స్విఫ్ట్ కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ కార్త్తీక్ హోమ్స్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో.. వెనుక నుంచి వచ్చిన వీరి కారు లారీని ఢీకొట్టింది.
ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న లక్ష్మణ్, జాన్సీ(35) కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూర్చున్న కుశాల్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకొని ప్రథమ చికిత్స చేయించారు. ప్రమాద సమయంలో లక్ష్మణ్ భార్య జాన్సీ కారు నడుపుతున్నదని పోలీసులు తెలిపారు. మరోవైపు, నాయినమ్మ వద్ద ఉండటంతో ఆకాంక్ష ప్రాణాలు దక్కించుకున్నది. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఈస్ట్జోన్ పోలీసులు సంతాపం ప్రకటించారు. ప్రమాదంతో లక్ష్మణ్, జాన్సీల స్వగ్రామాల్లో విషాదం అలుముకున్నది.