వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని, అన్ని సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా అందజేయనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 18 మందికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్ బుధవారం బి.ఫామ్ లు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూలేని విధంగా వరంగల్ అభివృద్ధి కోసం కార్పొరేషన్కు నేరుగా బడ్జెట్లో ఏటా రూ. 300 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు వేరే పార్టీలు దరిదాపుల్లో కూడా లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కుటుంబ సభ్యులుగా పార్టీ గెలుపు కోసం సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్ నగరం అభివృద్ధి కావాలన్నా, ఇక్కడి ప్రజల అవసరాలు తీరాలన్నా ఈ నగరం గురించి, నగర ప్రజల అవసరాల గురించి సంపూర్ణంగా తెలిసిన సీఎం కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టాలని, టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నట్లు చెప్పారు. పండగ రాగానే ఇల్లు అలికినట్లు… ఎన్నికలు రాగానే కొంతమంది రాజకీయ నేతలు, పార్టీలు ఓట్ల కోసం కొత్త బిచ్చగాళ్ల వలె వస్తున్నారు. అయితే ఎవరు ఏమీ చేశారో మేధావులు, ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు.