ఒకప్పటితో పోలిస్తే ఈమధ్య అమ్మాయిల్లో నెలసరి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పెండ్లయినవారిలో సంతానోత్పత్తికి సంబంధించిన ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) అని చెబుతున్నారు డాక్టర్లు. అయితే మనసు, శరీరం మధ్య సమతౌల్యం సాధిస్తే చాలారకాల సమస్యలు దరిచేరవు. ఆ బ్యాలెన్స్ రావాలంటే యోగా చేయాలి. 15 నుంచి 45 ఏండ్ల మహిళల్లో పీసీఓఎస్ వచ్చే ఆస్కారం ఉంది. ఇదొక హార్మోనల్ సమస్య. మహిళల ఓవరీస్, పునరుత్పత్తి హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్ల నెలసరి ఆలస్యంగా రావడం, లేదంటే ఎక్కువరోజులు కొనసాగడం జరుగుతుంది. కొన్నిసార్లు పురుష హార్మోన్ల ఉత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది. యోగా సాధన వల్ల సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. యోగ స్థితిలో మనసు, శరీరం పరిపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటాయి. ఈ సిండ్రోమ్తో ఇబ్బంది పడుతున్నవారు వారానికి ఐదురోజులు, రోజుకు అరగంట యోగా చేయాలని చెబుతారు. ఫలితంగా టెస్టోస్టెరోన్ స్థాయులు 30 శాతం తగ్గుతాయని ఓ అంచనా. దీంతోపాటు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి. మాలాసనం, భుజంగాసనం, బద్ధకోణాసనం, నౌకాసనం, సూర్య
నమస్కారం నిత్యం సాధన చేయాలన్నది నిపుణుల సిఫారసు.