సంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో దళిత, గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న జార్ఖండ్ సహా ఇతర ఏ రాష్ర్టాల్లోనూ గిరిజన బాలుర న్యాయ కళాశాల లేదని.. సీఎం చొరవతోనే రాష్ట్రంలో దళిత, గిరిజన న్యాయ కళాశాలలు ఏర్పాటైనట్టు స్పష్టం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి గిరిజన బాలుర రెసిడెన్షియల్ న్యాయ కళాశాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దళిత, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. 2014లో గిరిజన సంక్షేమానికి రూ.70 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత బడ్జెట్లో ఎనిమిది రెట్లు పెంచి రూ.570 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దేశంలోనే మొదటి గిరిజన బాలుర రెసిడెన్షియల్ న్యాయ కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటుచేయడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. గిరిజనులకు ఉన్నత విద్య అందజేసేందుకు రూ.1200 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నట్టు స్పష్టంచేశారు. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో పలువురు గిరిజన విద్యార్థులు ఇండియన్ బిజినెస్ స్కూల్లో చేరినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటి ల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు జడ్జీల బదిలీ
రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్లో 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్గా ఉన్న క్షమా దేశ్పాండేను ఆదిలాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వరంగల్లో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జీగా ఉన్న జే విక్రమ్ నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శిగా నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో సీనియర్ సివిల్ జడ్జీగా ఉన్న మొహమ్మద్ అబ్దుల్ జావీద్పాషా ఖమ్మం జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.