హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఒకవైపు మృత్యువు కబళిస్తున్నా ఐదుగురికి అవయవదాతగా నిలిచాడు పదమూడేండ్ల బాలుడు. ఖమ్మం జిల్లా భద్రాచలం కొత్తకాలనీ అశోక్నగర్కు చెందిన కొయ్యాల సీత కుమారుడు కొయ్యాల సిద్దార్ధ (13) ఈ నెల 17న జ్వరం, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని లక్డీకాపూల్లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే బుధవారం బ్రెయిన్డెడ్కు గురైనట్టు న్యూరో ఫిజిషియన్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. జీవన్దాన్ ప్రతినిధులు సిద్దార్ధ శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కార్నియా సేకరించారు. అవయవాలు అవసరమున్న వారికి వాటిని అందజేస్తామని వైద్యులు తెలిపారు.