హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ‘పద్నాలుగు నెలలు పసికందు సహ కుటుంబంలో ఆరుగురికి కరోనా. మందుల్లేవు, ఇంట్లో సరుకులూ లేని పరిస్థితి. ఆదుకొని బతుకునివ్వండి’ అంటూ ఒక కుటుంబం చేసిన ట్వీట్కు ఐటీమంత్రి కే తారకరామారావుకు స్పందించారు. తక్షణం ఆ కుటుంబానికి ఆత్మీయస్పర్శ అందించారు. అధైర్య పడొద్దని భరోసా ఇవ్వడంతోపాటు, సంబంధిత అధికారులను పురామాయించి వారికి కావలసిన అన్నిఏర్పాట్లు చేశారు. పసికందుకు కావలసిన మందులను తక్షణం తెప్పించి నేరుగా వెళ్లి అందజేయాలని టీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డిని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశంతో బాధితుడికి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలపై ఆరాతీసి పాపకు మందులు అందజేశారు.
తమ దీనపరిస్థితి చూసి తక్షణం స్పందించి ఆదుకున్న మంత్రి కేటీఆర్కు ఆ కుటుంబం కృతజ్ఞతలు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి… హైదరాబాద్లోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లికి చెందిన ముత్యం శ్రీధర్ ఓ ఐటీ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు శ్రీకాంత్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. కరోనా కారణంగా అతడి ఉద్యోగం పోయింది. ఆ కుటుంబానికి శ్రీధర్ ఒక్కరే ప్రస్తుతం ఆధారం. శ్రీధర్తోపాటు వృద్ధులైన తల్లిదండ్రులు యాదగిరి, శారద, తమ్ముడు, భార్య ప్రభావతి, 14 నెలల పాప లియాంజ్ కలిసి అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం వారందరూ కరోనా బారినపడ్డారు.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు మందుల్లేవని, నిత్యావసర సరుకులు కూడాలేవని, తమను ఆదుకోవాలని శ్రీధర్ ఆదివారం మంత్రి కేటీఆర్కు ట్వీట్చేశారు. మంత్రి ఆదేశాలతో సతీశ్రెడ్డి, సంతోష్గౌడ్ను వెంటబెట్టుకొని శ్రీధర్ ఇంటికెళ్లి వారి యోగక్షేమాలు అడిగి మందులు అందజేశారు. తమ పరిస్థితిని పెద్ద మనసుతో అర్థంచేసుకొని ఆదుకున్న మంత్రి కేటీఆర్కు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. ట్వీట్చేసిన రెండు గంటన్నర వ్యవధిలోనే తమ ఇంటికి పీహెచ్సీ సిబ్బంది హోం ఐసొలేషన్ కిట్లు అందజేశారని చెప్పారు.