లక్నో: భార్యభర్తల మాదిరిగా ప్రియుడితో కలిసి హోటల్లో గడిపేందుకు ఒక మహిళ తన సోదరుడి కుమార్తెను కిడ్నాప్ చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ చిన్నారని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళతోపాటు ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్కు చెందిన 20 ఏండ్ల నిషు ద్వివేది, సోదరుడి కుమార్తె అయిన మూడేండ్ల బాలికను కిడ్నాప్ చేసింది. ఆ పాపను తీసుకుని పంజాబ్లోని జలంధర్లో ఉంటున్న ప్రియుడు నవదీప్ సింగ్ అలియాస్ గిన్ని (25) వద్దకు వెళ్లింది.
మరోవైపు పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా బాలికతో కలిసి నిషు జలంధర్లోని ప్రియుడి వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. ఒక పోలీస్ బృందం శుక్రవారం జలంధర్కు వెళ్లి హోటల్లో ఉన్న నిషు, నవదీప్ సింగ్ చెరలోని బాలికను రక్షించారు. వారిద్దరిని అరెస్ట్ చేసి ఫతేపూర్కు తీసుకువచ్చారు.
కాగా, నవదీప్ సింగ్ను పెండ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయినట్లు పోలీసులకు నిషు తెలిపింది. ఎవరికీ అనుమానం రాకుండా భార్యాభర్తల మాదిరిగా హోటల్లో ప్రియుడితో కలిసి బస చేసేందుకు పాపను తన వెంట తీసుకెళ్లినట్లు చెప్పింది. ఆ బాలికకు ఎలాంటి హానీ తలపెట్టే ఉద్దేశం తనకు లేదని పోలీసులకు ఆమె వెల్లడించింది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసిన నిషు, నవదీప్ సింగ్ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.