కామారెడ్డి టౌన్, మార్చి 30: గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కలెక్టర్లతో పల్లెప్రగతి, ధరణి, హరితహారం, ఇంటిగ్రేటెట్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటు, రైతు కల్లాలు, పల్లె ప్రకృతివనాలు, కొవిడ్ పరీక్షలు, యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లాల వారీగా మంగళవారం సమీక్షించారు. వీసీలో ఆయనతో పాటు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, సహకార శాఖ కమిషనర్ అనిల్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ, తూకం యంత్రాలతో పాటు రైతులకు తాగునీటి వసతి, నీడ కోసం టెంట్ను ఏర్పాటు చేయాలని, కొవిడ్ దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ.. మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత లేదని స్పష్టం చేశారు. పల్లెప్రకృతి వనాలు గ్రామాలకు మరింత శోభ కలిగిస్తున్నాయని, ఇప్పటికీ ప్రారంభించని గ్రామాల్లో స్థల సేకరణ చేపట్టి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు కల్లాల లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో పది శాతం గ్రీన్ బడ్జెట్కు ఉపయోగించుకోవాలని, మొక్కల సంరక్షణ ముఖ్యమన్నారు. నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మండల ప్రత్యేకాధికారులు గ్రామాల్లో నర్సరీల నిర్వహణను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో రహదారుల పక్కన మూడు వరుసల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో రెండు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్మెజ్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు మూడు రోజుల్లో ప్రణాళికను రూపొందించాలని, ఆరు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కోటీ 25 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని, ఇప్పటికే 80 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఉపాధి కూలీలకు 18 లక్షల పనిదినాలను కల్పించి 111 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు. సీహెచ్సీ, పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదని తెలిపారు.
వీసీలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కామారెడ్డి ఆర్డీవో శ్రీను, డీఆర్డీవో చంద్రమోహన్రెడ్డి, సివిల్ సైప్లె డీఎం రంజిత్ ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
రియల్మీ 8 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
భారత్లో సూపర్బగ్ గుర్తింపు.. మరో మహమ్మారి ప్రబలే అవకాశముందని హెచ్చరిక