మూసాపేట(అడ్డాకుల), మార్చి 29 : మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని సోమవారం తెల్లవారుజామున కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య పల్లకీసేవ నిర్వహించి కుంభం సమర్పించారు. అనంతరం నిర్వహించిన రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా తిరుమలనాథుడి రథోత్సవం
మండలంలోని మాదారం, యారోనిపల్లి గ్రామాల మధ్య వెలిసిన తిరుమలనాథస్వామి రథోత్సవాన్ని సోమవారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి రథాన్ని లాగారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.