హుజూరాబాద్ టౌన్/హుజూరాబాద్/జమ్మికుంట రూరల్/వీణవంక, అక్టోబర్ 21: దళితబంధును బీజేపీనే ఆపిందని, పథకాన్ని ఆపి అంబేద్కర్ను అవమానించిందని పలువురు దళిత నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ ఆంక్షల ముసుగులో అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్షా కనుసన్నల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని, అందుకే కోడ్కు ముందే అమలులో ఉన్న దళితబంధు పథకాన్ని కావాలని ఆపి, రాజ్యాంగ నిర్మాతను కించపరిచిందని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేదర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం దళితబంధును నిలిపి వేయడంపై ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు తమ అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు వేయాలని కోరారు. ఆది నుంచి ఈటలకు దళితుల పట్ల వ్యతిరేక భావనే ఉన్నదని, దళితులు ఆర్థికంగా ఎదగకుండా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దళిత ద్రోహి, మనువాద పార్టీలో చేరిన ఈటలను దళిత జాతి ఇండ్లల్లోకి రాకుండా అడ్డుకుంటుందని మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు స్పష్టంచేశారు. వీణవంకలోని దళితవాడల్లో గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారంచేశారు. కాన్పు నుంచి కల్యాణం వరకు మహిళలకు అండగా ఉండి, మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, సంచార జాతుల్లో కష్ట జీవులు బుడగజంగాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం ఇంద్రనగర్లో మహిళల సమావేశానికి, పట్టణ పరిధిలోని మారుతీనగర్లో బుడగజంగాల ఆత్మీయ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్కు స్వచ్ఛందంగా మహిళలు ముందుకొచ్చి మద్దతు తెలుపడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.