సుల్తాన్బజార్, మే 29: కొవిడ్తో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వ్యాధి వెంటాడుతున్నది. కోఠిలోని చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ)దవాఖాన బ్లాక్ఫంగస్ రోగులకు మెరుగైన చికిత్సనందిస్తూ కోలుకొనేలా సహాయపడుతున్నది. ఎనిమిది రోజుల్లో 175 మందికి ఆపరేషన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచింది. వందలసంఖ్యలో వస్తున్న రోగులకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ నేతృత్వంలోని వైద్యబృందం మెరుగైన చికిత్సను అందిస్తున్నది. గత 12 రోజుల్లో 113 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. బ్లాక్ ఫంగస్ రోగులకు ఈ నెల 22 నుంచి ఈఎన్టీ దవాఖానలో శస్త్రచికిత్సలు ప్రారంభించారు. తొలిరోజు నాలుగు, ఎనిమిది రోజుల్లో 175 ఆపరేషన్లు చేశారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభు త్వం ఈఎన్టీ దవాఖానకు అదనపు వైద్యులు, సిబ్బందిని కేటాయించింది.
సిద్దిపేట, సూర్యాపేట నుంచి ఇద్దరు ఈఎన్టీ సర్జన్లను, ఉస్మానియా, నిలోఫర్ దవాఖానల నుంచి 10 మంది అనస్థీషియా స్పెషలిస్టులను, డెంటల్ కళాశాల నుంచి ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను, గాంధీ నుంచి ఇద్దరు థియేటర్ అసిస్టెంట్లను, నలుగురు థియేటర్ వార్డ్బాయ్లను పంపించింది. వీరి రాకతో శస్త్రచికిత్సల సంఖ్య ను పెంచేందుకు అవకాశం ఏర్పడిందని సూపరింటెండెంట్ తాటి శంకర్ తెలిపారు. మొత్తం వైద్యులతో రెండు బృందాలుగా ఏర్పడి, ఆపరేషన్ థియేటర్లోని ఐదు టేబుళ్లపై ఒక షిఫ్ట్లో 25, రెండో షిఫ్ట్లో 25 ఆపరేషన్ల చొప్పున రోజుకు 50 శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్లాక్ఫంగస్ రోగులను క్షేమంగా ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.