నమోదైన కేసులన్నీ ప్రైవేట్ దవాఖానల్లోనే
అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖ
భయాందోళన వద్దని ప్రజలకు సూచన
రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో బ్లాక్ఫంగస్ వ్యాధి కలకలం రేపుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 50 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లోనే నమోదుకావటం గమనార్హం. బ్లాక్ఫంగస్ బారినపడ్డవారిలో 90శాతం కరోనా చికిత్స తీసుకుంటున్న వారేనని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధిత రోగులకు ఆయా ప్రైవేట్ దవాఖానల్లోనే చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, బ్లాక్ఫంగస్ సోకినవాళ్లకు కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం చికిత్స అందిస్తున్నది.
కొవిడ్ బాధితులందరికీ బ్లాక్ఫంగస్ రాదు
కొవిడ్ బాధితులందరికీ బ్లాక్ఫంగస్ రాదు. మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్స్ ఎక్కువ మోతాదులో వాడినవారు ప్రభావితమవుతున్నారు. రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు మంచి ఆహారంతోపాటు యోగా, వ్యాయామం చేయాలి.
– రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి