న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 23 పైసలు, డీజిల్ లీటర్కు 27 పైసల వరకూ పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.44, డీజిల్ లీటర్ రూ.84.32కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది. పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57కు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, చెన్నైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ 87,16కు చేరాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.91.92కు చేరింది.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. మే నెలలో ఇప్పటి వరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్పై దాదాపు రూ.3.04, డీజిల్పై రూ.3.59 పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ.32.90, డీజిల్పై రూ .11.80 వసూలు చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఓ వైపు కరోనాతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్, నైట్కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పనుల్లేక ఇబ్బందులు పడుతుండగా.. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల మరింత పెనుభారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.