ముంబై: ముంబైలోని సర్కారు దవాఖానల్లో చికిత్స పొందేకన్నా రోగ బాధలు భరిస్తానని, వీలైతే చనిపోతానని హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి బాంబే హైకోర్టుకు తెలిపారు. ఎల్గార్ పరిషద్- మావోయిస్టుపార్టీ సంబంధాల కేసులో ఆయన విచారణ ఖైదీగా తలోజా జైలులో ఉన్నారు. శుక్రవారం ఆయనను వీడియో కాన్ఫరెన్సు ద్వారా హైకోర్టు న్యాయమూర్తులు ఎస్జే కఠావాలా, ఎస్పీ తావడేలతో కూడిన ధర్మాసనం ముందు హాజరు పరిచారు. ముంబై జేజే హాస్పిటల్ స్వామి ఆరోగ్యంపై ఇచ్చిన నివేదికను జైలు అధికారులు కోర్టుకు అందజేశారు. 84 సంవత్సరాల స్వామికి రెండు చెవుల్లో వినికిడి చాలా తగ్గిపోయిందని, చేతులు వణుకుతున్నాయని, అటూఇటూ తిరగలేకపోతున్నారు కనుక చేతికర్రగానీ, చక్రాల కుర్చీ గానీ అవసరమని వైద్య నివేదికలో సూచించారు. అయితే మొత్తంమీద ఆయన నాడి బాగానే ఉందని, చికిత్సకు సహకరిస్తున్నారని వివరించారు. జైలులో తాను చాలా కష్టాలు అనుభవించానని స్వామి కోర్టుకు తెలిపారు. తలోజా జైలుకు తెచ్చినప్పుడు తన శరీరం ఇంకా బాగానే పనిచేస్తున్నదని, ఎనిమిది మాసాల కాలంలో శుష్కించిపోయిందని చెప్పారు. “విషయం ఏమిటంటే ఎనిమిది నెలల క్రితం నా స్నానం నేను చేయగలిగేవాడిని.. అటూఇటూ నడవగలిగే వాడిని.. రాతకోతల పని కూడా చూసుకునేవాడిని.. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి పోతున్నాయి.. తలోజా జైలు నన్ను రాయలేని, నడవలేని స్థితికి తెచ్చింది.. అన్నం కూడా తినలేకపోతున్నాను.. ఎవరో ఒకరు చెంచాతో నాకు తచినిపించాల్సిందే” అని ఫాదర్ స్టాన్ స్వామి కోర్టుకు విన్నవించారు. ఆరోగ్య చికిత్స కోసం ప్రభుత్వ జేజే ఆస్పత్రికి పంపమంటారా అని కోర్టు అడిగితే ఆయన అది తనకు అంత ఉపయోగకరంగా ఉండదని సమాధానమిచ్చారు. “జేజే హాస్పిటల్ వారు నాకు ఏం మందులిస్తారు.. అక్కడికి రెండుసార్లు వెళ్లాను.. అక్కడి ఏర్పాట్లు తెలుసు. నాకు అక్కడికి వెళ్లాలని లేదు” అని స్వామి చెప్పారు. ఈ బాధలు అనుభవించి వీలైతే చనిపోతా.. లేదా మధ్యంతర బెయిలు ఇస్తే రాంచీకి వెళ్లిపోయి మిత్రులతో గడిపేస్తా అని వేడుకున్నారు. స్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, జేజే ఆస్పత్రి వారి సూచను తు.చ. తప్పకుండా పాటించాలని ధర్మాసనం తలోజా జైలు అధికారులను ఆదేశించింది.