దుండిగల్, మే 22: కరోనా సమయంలో వైద్యులు, అధికారులు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. శనివారం దుండిగల్ పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు వచ్చే వారికి అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుండిగల్ మున్సిపాలిటీని సందర్శించి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ హెల్ప్లైన్ డెస్క్కు వస్తున్న ఫిర్యాదులు, కొవిడ్ రోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైద్యులు, అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. అనంతరం దొమ్మరపోచంపల్లిలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేను పరిశీలించి సిబ్బంది ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, మందుల పంపిణీతో పాటు వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ మరింత భరోసా ఇవ్వాలని సూచించారు. దీనికి తోడు లాక్డౌన్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాగే పలు వ్యాపారాలు, దుకాణ సముదాయాల వద్ద జనాలు గుమికూడకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, డీఎంహెచ్వో మల్లికార్జున్, తహసీల్దార్ భూపాల్, దుండిగల్ కమిషనర్ భోగీశ్వర్లు, వైద్యాధికారి నిర్మల, సిబ్బంది ఉన్నారు.