హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి శనివారం వరకు 39 రోజుల లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించింది. 6,00,313 మందిపై ఈ-పిట్టీ కేసులు, ఈ-చలాన్లు విధించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా 4,64,070 మందిపై కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసులు బుక్కయ్యాయి. మాస్కులు ధరించని 1,02,346 మందిపై, నిబంధనలకు విరుద్ధంగా జనసమర్థం ఏర్పడేలా శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు చేయడంతో 7,137 మందిపై కేసులు నమోదుచేశారు. భౌతికదూరం పాటించని 26,760 మందిపై ఈ-పిట్టీ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి జరిమానాలు.. సెక్షన్లను బట్టి జైలు శిక్షలు సైతం విధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. లాక్డౌన్ సమయంలో పట్టుబడిన వాహనాలను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులకు నిబంధనల మేరకు తిరిగి ఇస్తున్నారు.