వరంగల్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ మొదటి నుంచీ ఉత్తర భారతదేశ పార్టీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీజేపీ అన్ని విషయాల్లో దక్షిణ భారతదేశంపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే పన్ను, ఒకే ఆరోగ్య, విద్యావిధానం అని చెప్పే బీజేపీ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. జమ్ముకశ్మీర్లో అధికారం కోస మే అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను చేపట్టిన బీజేపీ.. తెలుగు రాష్ర్టాల్లో దీన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిందని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్కు ఒక న్యాయం, తెలుగు ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. బీజేపీకి తెలుగు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చే సీన్లేదని జోస్యం చెప్పారు. అందుకే తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచడంలేదని ఎద్దేవాచేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి బుధవారం హన్మకొండలో వినోద్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కాగా అమలుచేసిన రాష్ర్టాలకు కేంద్రం వైఖరితో రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే దక్షిణాది రాష్ర్టా ల్లో లోక్సభ స్థానాలకు కోత పడుతుందని.. ఆ మేరకు జనాభా నియంత్రణ పాటించని ఉత్తరప్రదేశ్, బీహార్లో పెరుగుతాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఇది వర్తించదని, రాష్ర్టానికి సంబంధించిన ప్రక్రియని చెప్పారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం అన్యాయం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం ప్రతిసారీ అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పట్లో పెంచడంలేదని చెప్పి మొండి వైఖరిని చాటుకున్నదని విమర్శించారు. నిధులు, పథకాల అమలులో ఉత్తరప్రదేశ్, గుజరాత్పై ఉన్న ప్రేమ తెలంగాణపై ఉండట్లేదని విమర్శించారు. 2026 అనంతరం జనాభా లెక్కలు గెజిట్లో వచ్చాక సీట్లు పెంచుతామనడం ఏకపక్షమని విమర్శించారు. జమ్ముకశ్మీర్కు లేని అడ్డంకులు తెలుగు రాష్ట్రాలకు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టానికి సవరణలు చేసి ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, ఇప్పుడు మాత్రం సాకులు చూపిస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్ల పునర్విభజన విషయంలో కేంద్రం దిగి వచ్చేవరకు పోరాటం చేస్తామని ఎర్రబెల్లి స్పష్టంచేశారు.