హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇటీవలే ఉత్తీర్ణులైన పదోతరగతి విద్యార్థులకు ఇంటర్బోర్డు శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలచేసింది. జూన్ ఒకటో తేదీ నుంచే ఫస్టియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ప్రకటన విడుదలచేశారు. మొదటి విడుత ఫస్టియర్ ఆన్లైన్ ప్రవేశాలు మంగళవారం నుంచే ప్రారంభిం చినట్టు వెల్లడించారు. ఈ ప్రవేశాల ప్రక్రియ జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్ మాత్రమే నని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎస్సెస్సీ విద్యార్థుల ఇంటర్నెట్ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించిన ఆయన, ఎస్సెస్సీ ఒరిజినల్ మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్ అడ్మిషన్లను ఆమోదిస్తామని స్పష్టంచేశారు. ఇతర వివరాల కోసం TSBIE/ acadtsbie. cgg. gov.in / tsbie.cgg.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.
ఏటా జూన్ 1 నుంచే ఇంటర్ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్ 1 నుంచే ఆన్లైన్ క్లాసులతోపాటు, మంగళవారం నుంచే ప్రవేశాలు ప్రారంభించారు. సెకండియర్ ఆన్లైన్ క్లాసులపై నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి ప్రారంభిస్తామని జలీల్ వెల్లడించారు. టెన్త్ పాసైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కో ఆపరేటివ్, తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇంటెన్సివ్, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.