కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈటల విషయంలో బీజేపీ నేతల తీరును నిరసిస్తూ కరీంనగర్లోని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. హుజూరాబాద్ 11వ వార్డు కౌన్సిలర్ దండ శోభ, నాయకులు విక్రమ్రెడ్డి శుక్రవారం కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల, ఆమె భర్త కృష్ణ, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రజిత, ఆమె భర్త సీనియర్ నాయకుడు శంతన్రెడ్డిలు కూడా టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అందరు అనుకున్నట్లుగా ఈటల సౌమ్యుడు కాదని దండ శోభ, శంతన్రెడ్డి అన్నారు. ఆయన రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయన్నారు. ఆయనతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. ఒకే పార్టీలో ఆయనతో కలిసి పనిచేయలేక తాము టీఆర్ఎస్లోకి వచ్చినట్టు చెప్పారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.
మేడ్చల్, మే 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్ దేవాదాయ భూముల వ్యవహారంలో రాజ్యాభిలేఖనం కార్యాలయం నుంచి మరిన్ని పత్రాలను సేకరించే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. రాజ్యాభిలేఖనంలో లభించిన కీలకపత్రాలను పరిశీలన అనంతరం మరోమారు ఉన్నతస్థాయి అధికారి పర్యవేక్షణలో మరిన్ని పురాతన లిపి పహణీ, పత్రాలను శుక్రవారం పరిశీలించినట్టు సమచారం. ఇప్పటికే దేవాదాయ భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఇచ్చిన అనుమతులపై 60 మందికి పైగా అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణ పూర్తిచేసి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. మరిన్ని పక్కా అధారాల కోసం రాజ్యాభిలేఖనంలోని పురాతన పత్రాలను పరిశీలించి తదుపరి నివేదికలో పొందుపర్చనున్నట్టు సమాచారం.
1925-26 నాటి రికార్డు ఆధారంగా ..
దేవరయాంజల్ దేవాలయ భూములకు సంబంధించి 1925-26లో సీతారామస్వామి దేవాలయం పేరిట ఉన్న పత్రాలు లభ్యమైనట్టు సమాచారం. ఈ మేరకు ఉన్నతస్థాయి అధికారి పర్యవేక్షణలో పత్రాల అధ్యయనం క్షుణ్ణంగా జరుగుతున్నది.
ఈటలను బీజేపీలో చేర్చుకోవద్దు
తెలంగాణ అంధుల సంక్షేమ సంఘం నేత చొక్కారావు
హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవద్దని అంధ పాఠశాల నిర్వాహకుడు, అంధుల అభివృద్ధి, సంక్షేమ సంఘం(డీడబ్ల్యూఏబీ) ప్రధాన కార్యదర్శి పీ చొక్కారావు కోరారు. సైద్ధాంతికంగా బీజేపీకి మద్దతుదారుడినైన తాను ఒక స్వయం సేవకుడిగా ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో చలించిపోయినట్టు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినని చెప్పుకొనే ఈటల వికలాంగులను అవమానించారని, ప్రత్యేకించి అంధులను చులకన చేసి మాట్లాడినట్టు చెప్పారు. ఈటల బీజేపీలో చేరితే పార్టీకే చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి భూ కబ్జాకోరుడిని బీజేపీలో చేర్చుకోకూడదని పార్టీ నేతలను కోరారు.
రావల్కోల్ భూ రికార్డులు లభ్యం!
మేడ్చల్, మే 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ భూ వ్యవహరంలో రెవెన్యూ అధికారులకు రికార్డులు లభించినట్టు సమాచారం. ఈటల తనయుడు నితిన్రెడ్డి రావల్కోల్లోని 77 సర్వేనంబర్లో గల 10.11 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు బాధితుడు పిట్ల మహేశ్ ఇప్పటికే సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు వేర్వురుగా కొనసాగిస్తున్న విచారణలో బాధితుడు ఇచ్చిన ఆధారాల మేరకు రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికైతే 76, 77, 78 సర్వే నంబర్లకు సంబంధించి సీలింగ్, ఇనాం రికార్డులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో లభించినట్టు సమాచారం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాస్థాయి అధికారి ఇనాం, సీలింగ్ రికార్డులను పరిశీలిస్తున్నారు.