నల్లగొండ: బీజేపీ నేతలు రాజ్యాంగ విరుద్ధంగా, వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. టీఆర్ఎస్పై చార్జిషీట్ విడుదల చేస్తున్నామన్న బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్.. దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ నాయకులపైనే ప్రజలు చార్జిషీట్ ఓపెన్ చేసి శిక్ష విధిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపును కాంక్షిస్తూ మంత్రి ఇవాళ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి నిడమనూరు మండలంలో ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి భూములను ఎండబెట్టి ఆంధ్రకు నీరు పంపిన ఘనుడు జానారెడ్డి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవుల కోసం ఆంధ్ర నాయకుల వద్ద మోకరిల్లిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని మంత్రి విమర్శించారు. ఇక్కడి ఓట్లతో గెలిచి సాగర్ ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందించని జానాతో ఇక పనిలేదని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీని గెలిస్తే సాగర్ నియోజకవర్గంలో విప్లవాత్మకమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. భగత్ యువకుడు, విద్యావంతుడని, నోముల నర్సింహ్మయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోయే సత్తా ఉన్న నాయకుడని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో భగత్ 50 వేల మెజార్టీతో గెలుస్తున్నాడని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను మించిన గొప్ప మానవతా వాది మరొకరు లేరన్నారు. కరోనాతో ఉపాది కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆర్థిక చేయూత, బియ్యం అందిస్తూ సీఎం మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..