బొడ్రాయిబజార్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలు కాకుండా ప్రజా క్షమాపణ యాత్ర చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో ఏర్పాటు చేసిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తూ ప్రజా యాత్రలు చేయడే మంటని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజా పరిపాలన చేయకుండా దేశాన్ని అమ్మడం కోసం వాణిజ్య వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో రైతులు, కార్మికులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోకుండా పాలన కొనసాగిస్తున్న బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ఎన్డీఏ సర్కారు పక్కన పెట్టి 70 ఏండ్ల దేశ సంపద వనరులను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసమే పనిచేస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందని అన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసం కార్పొరేట్ భక్తుల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టేందుకు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారని విమర్శించారు.
కార్మికుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తూ కనీస వేతన చట్టం అమలు చేయకుండా తెచ్చిన కార్మికుల లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయకుండా ఆర్ఎస్ఎస్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. చట్ట సభలను సక్రమంగా నడుపకుండా, ప్రజా సమస్యలపై చర్చ లేకుండా కార్పొరేట్ అనుకూల విధానాల కోసమే చట్టసభలు నడుపుతున్నారన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం దేశంలో పాలన సక్రమంగా లేదని చట్టాలు, పోలీసు వ్యవస్థ ప్రజల పక్షాన లేకుం డా అధికార పార్టీల పక్షాన, కార్పొరేట్ శక్తుల కోసం పని చేయడం సరికాదని విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విధంగా దేశంలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక పరిపాలన నుంచి మమ్మల్ని క్షమించాలని కొరుతూ ప్రజా క్షమాపణ యాత్ర చేయాలన్నారు. కేంద్ర అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిరసనలు, 6న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేపడుతామని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, నాయకులు ముల్కలపల్లి రాములు, కొలిశెట్టి యాదగిరిరావు, వెంకటేశ్వర్రావు, కోట గోపి, మట్టిపల్లి సైదులు, దండ వెంకటరెడ్డి, నరసింహరావు, ఏకలక్ష్మి, శ్రీకాంత్, పద్మావతి, నగేశ్, శంకర్రెడ్డి, వట్టెపు సైదులు, ముత్యాలు, కుమార్, శ్రీనివాస్, అవిలయ్యలు పాల్గొన్నారు.