హుజూరాబాద్ రూరల్/ కమలాపూర్, ఆగస్టు 14: దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని, ఇది దేశంలోనే అద్భుత పథకమని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కొనియాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో దళితులు కారు గుర్తుకే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సోమవారం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభ సమావేశానికి దళిత వాడల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరుతూ శనివారం హుజూరాబాద్లో, హన్మకొండ జిల్లా కమలాపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని కొనియాడారు. మనువాదం పోయినప్పుడే దళిత జాతి అభివృద్ధి చెందుతుందని బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. బీజేపీ మనువాద రూపంలో అణగారిన వర్గాలపై దాడి చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు దళితవాడల్లోకి ఓట్ల కోసం వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దళితబంధుపై బీజేపీ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తూ దళితుల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.