సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మనుషుల జీవితాలపై కరోనా తన ప్రభావం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేస్తున్నది. నిన్న మొన్నటి వరకు లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వారంతా ప్రస్తుతం సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నగరాల్లో ఉంటూ వారి కుటుంబ సభ్యులను మాత్రం సొంతూళ్లకు పంపుతున్నారు. ఇలా చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. నగరంలో ఉంటే మహమ్మారి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ భార్య, పిల్లలను ఊరి బాట పట్టించారు. భర్తలు మాత్రం ఉద్యోగం కారణంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరోసారి బ్యాచిలర్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.
కొవిడ్ భయంతో కుటుంబాన్ని సొంతూరుకు పంపించా. విధి నిర్వహణలో భాగంగా రెండు నెలల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం నేను ఒక్కడినే ఇంట్లో ఉంటున్నందున ఎలాంటి భయం లేదు. నేను కొవిడ్ బారిన పడిన నా నుంచి కుటుంబ సభ్యులకు సోకుతుందన్న భయం లేదు. – రాజీవ్ విలియమ్స్, వ్యాపారవేత్త.
మహమ్మారి విజృంభణతో నా కుటుంబ సభ్యులు సొంతూరికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రతి పని నేనే చేసుకోవాల్సి వస్తున్నది. బయట ఫుడ్ ఆర్డర్ చేద్దామంటే వైరస్ భయం. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్లి అన్ని పనులు చేసుకోవాల్సి రావడం భారంగా మారింది. నిజంగా నా వైఫ్ ఎంత కష్టపడుతుందో ఇప్పుడు తెలిసొచ్చింది. ఆమెకు హ్యాట్సాఫ్. – వెంకీ, ఉద్యోగి.