తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలు శూన్యం
జీడీపీని తగ్గించి దేశ ప్రతిష్ఠను దిగజార్చింది: మంత్రి హరీశ్రావు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదని, చివరకు విభజన హామీలను సైతం నెరవేర్చకుండా తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ పరిశ్రమ పూర్తిగా రద్దుచేసి తెలంగాణకు ఆన్యాయం చేసిందని ఆగ్రహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి జీడీపీని పూర్తిగా దిగదార్చి.. దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని చెప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆధ్యాపకులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం, శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్లో చేవెళ్ల నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశం, శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉన్నదన్నారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్లల్లోనే పూర్తి చేసి, సాగునీటిని అందించామని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. హైదరాబాద్- మహబూబ్నగర్- రంగారెడ్డి పట్టభద్రుల ఎన్నికల్లో 93 మంది పోటీలో ఉండగా, కేవలం వాణీదేవి మాత్రమే మహిళ అని, మహిళా ఓటర్లు 1.95 లక్షల మంది వరకు ఉన్నారని.. వారంతా వాణీదేవికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని కోరారు. మహిళ రక్షణకు షీటీంలు ఏర్పాటు చేసి క్రైం రేటును తగ్గించామని గుర్తుచేశారు. మల్కాజిగిరి నుంచి ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి రామచందర్రావు తాజాగా మూడోసారి ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ఓటమి పాలై హ్యాట్రిక్ సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమా ల్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎన్నికల ఇంచార్జి గట్టు రాంచంద్రారావు, ఎమ్మెల్యేలు కాలె యాద య్య, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే కేఎస్ రత్నం తదితరులు పాల్గొన్నారు.