హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి సరిపోయినన్ని వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడం, రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర మంత్రివర్గం దృష్టి సారించింది. ఈ సమస్యకు పరిష్కారంగా గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఎంతమేర వ్యాక్సిన్ సేకరించాలి.. టెండర్ల కాల పరిమితిని ఎప్పటివరకు నిర్ధారించాలనే అంశంపై మంత్రి వర్గం చర్చించింది. దేశీయంగా వ్యాక్సిన్ల సరఫరా విషయంలో కేంద్రం విఫలమైన కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించాయి. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు డిమాండ్కు సరిపడా ఉండటం లేదు. మరోవైపు కేంద్రం 50 శాతం తీసుకుంటామని చెప్పడం, రాష్ట్రాలకు, ప్రైవేటు సంస్థలకు 50 శాతం ఇస్తామని చెప్పడంతో 18-44 ఏండ్ల వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రజల వ్యాక్సిన్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. దీనికోసం ఎంత ఖైర్చెనా చేసేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కమ్రంలో సొంతంగా వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు గ్లోబల్ టెండర్లకు ప్రభుత్వం వెళ్తున్నది. దీంతో భవిష్యత్ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కానున్నది. తద్వారా రాష్ట్ర ప్రజలకు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది.