కమలాపూర్, ఆగస్టు 5: దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి, మాదన్నపేట గ్రామాల్లోని దళిత కాలనీల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. దళితబంధును ఆపేందుకు బీజేపీ నాయకులు కోర్టులో కేసులు వేయించడంతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్లు దళితులను ఓట్లేసే యంత్రాలుగా వాడుకున్నారే తప్ప వారిబాగుకోసం ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ దమ్ముంటే దళిత బంధు కోసం కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. రాబోయే ఉపఎన్నికలో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని ఉపఎన్నిక కోసమే తీసుకొచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, కానీ గత శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు దళిత ఎంపవర్మెంట్ కోసం రూ.వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టారని గుర్తుచేశారు. అదే శాసనసభలో ఈటల రాజేందర్ సైతం చప్పట్లు కొట్టారని అన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 20 శాతం ఉన్న దళితజాతి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే అభినవ అంబేద్కర్గా సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సర్పంచ్ జవ్వాజి పద్మ, మండల ఇంచార్జి పేరియాల రవీందర్రావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ పెండ్యాల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.