గజ్వేల్/ ములుగు, జూన్ 22 : కాలం చెల్లిన విత్తనాలతో రైతులను మోసం చేయాలనుకున్న కర్నూల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై వ్యవసాయాధికారులు, పోలీసు లు ఆకస్మికంగా దాడి చేసి రూ.1.90కోట్ల విలువైన కాలం చెల్లిన విత్తనాలను పట్టుకున్న సంఘటన సోమవారం రాత్రి 10 గంటలకు చోటు చేసుకుంది. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై తీసుకుంటున్న కఠినచర్యల్లో భాగంగా గజ్వేల్ ఏడీఏ అనిల్కుమార్, ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో నెలరోజులుగా డివిజన్లో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యల్లోనే భాగంగా నమ్మదగిన సమాచారంతో ఏడీఏ అనిల్కుమార్, ములుగు ఎస్సై రంగకృష్ణ, ఏవో ప్రగతి, పోలీసు సిబ్బంది మండలంలోని బండమైలారం గ్రామ శివారులో ఉన్న కర్నూల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై దాడి చేశారు. కంపెనీలో గడువు ముగిసిన వరి, మక్కజొన్న విత్తనాలను గుర్తించారు. గడువు ముగిసిన విత్తనాలను అమ్మడానికి ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేసి తిరిగి రైతులకు విక్రయించడానికి సిద్ధం చేశారు. ధాన్యం విత్తనాలు, 10.850 ప్యాకెట్లు, 425క్వింటాళ్ల మక్కజొన్న విత్తనాలను గడువు ము గిసినవి. వీటి విలువ రూ.కోటి 90లక్షల 30వేలు అని అధికారు లు వెల్లడించారు. విత్తనాలను స్వా ధీనం చేసుకుని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ఏ ఒక్కరినీ వదిలిపెట్టం : సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్
కర్నూల్ సీడ్స్ ప్రైవేట్ లిమిడ్ కంపెనీలో పట్టుబడ్డ నకిలీ విత్తనాలపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ తీవ్రం గా స్పందించారు. కాలం చెల్లిన విత్తనాలను తిరిగి ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన విత్తన ప్యాకెట్లను మళ్లీ ప్యాక్ చేసి ఎవరికి విక్రయించారు? ఎక్కడెక్కడికి సరఫరా చేశారన్న? విషయాలపై దర్యాప్తు చేపట్టాలని ఏసీపీ నారాయణను ఆదేశించారు. రైతులను మోసం చేస్తున్న కాలం చెల్లించిన విత్తనాల విక్రయాల్లో ఎవరెవరికి సంబంధాలున్నాయో? తెలుసుకోవడానికి కేసును పూర్తిగా పరిశోధన చేయాలని పోలీసులను ఆదేశించారు.
నమ్మకస్తుల వద్దే కొనుగోలు చేయాలి : ఏసీపీ నారాయణ
ఆరుగాలం కష్టపడే రైతుకు విత్తనాల వ్యాపారులు మంచి నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని, అలాగే రైతులు కూడా నమ్మకమైన వ్యాపారుల వద్దే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫర్టిలైజర్ షాపులు, కంపెనీల్లో నిత్యం తనిఖీ చేస్తామని, రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విడివిడి విత్తనాలను కొనుగోలు చేయొద్దని సూచించారు. గడువు ముగిసినవాటితో పాటు నకిలీ విత్తనాలు ఉన్నట్లు సమాచారం వస్తే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబరు 7901100100 కు సమాచారం ఇవ్వాలని ఏసీపీ నారాయణ కోరారు.