హుజూరాబాద్, అక్టోబర్ 18: ఎన్నికలను అడ్డుపెట్టుకొని దళితబంధును నిలిపివేసి దళిత సమాజానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం చాలా బాధాకరమన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దళితబంధు పథకంపై అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, గోనె ప్రకాశ్రావు, పద్మనాభరెడ్డి, ప్రేమేందర్రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు దళితబంధు ఆపాలని లేఖలు రాశారని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను విలేకరుల సమావేశంలో కొప్పుల బయటపెట్టారు. ఈ లేఖల ఆధారంగానే దళితబంధును కేంద్ర ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని పేర్కొన్నారు. బీజేపీవాళ్లే ఫిర్యాదు చేసి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే దళితబంధు ఆగిపోయిందనడం హాస్యాస్పదమన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా వారి వ్యవహారం ఉందని, దళిత సమాజానికి ద్రోహం చేసిన బీజేపీకి దళితులందరు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఒక పథకం ఎన్నికల ముందే ప్రారంభమై కొనసాగుతుంటే ఆ పథకాన్ని ఆపమని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం దేశచరిత్రలోనే మొదటిసారిగా జరిగిందని విస్మయం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వెలువడకముందే బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్కు లేఖ రాసి కుట్రకు తెరలేపారని తెలిపారు. దళితబంధు పూర్తిస్థాయిలో అమలైతే ఓడిపోతామనే భయంతో రాజేందర్తో సహా ఆ పార్టీ నాయకులు లేఖ రాయాలని నిర్ణయించారని మండిపడ్డారు.
దళిత వ్యతిరేకి బీజేపీ.. : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
బీజేపీ అంటేనే దళిత వ్యతిరేకి అనే ముద్ర ఉందని విప్ బాల్క సుమన్ అన్నారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. దళితులందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలుసుకుని, ఎలాగైనా దళితబంధును ఆపాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. బీజేపీ దళిత ద్రోహిగా మిగిలిపోతుందని, దళితజాతి బీజేపీ నేతలను క్షమించదని అన్నారు. ఓట్లు అడగడానికి దళితవాడల్లో బీజేపీ నాయకులు ఎలా వస్తారో చూస్తామని, కేసీఆర్ దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకం ప్రవేశపెడితే అందులో లోటుపాట్లు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ ఆ పథకాన్ని ఆపివేసిందని బీజేపీ నేతలు అనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. బీజేపీ నైతిక బాధ్యత వహించి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసి దళితబంధును ఆపకుండా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసిన ద్రోహానికి దళితులు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని మరో 12 రోజులు మాత్రమే ఆపుతారని, అంతకుమించి ఏమీ చేయలేరని చెప్పారు. దళితుల భూములు గుంజుకున్న ఈటల రాజేందర్ ఇప్పుడు దళితబంధు ఆపివేశారని, బండి సంజయ్కి కనీస సోయి లేకపోవడంతోనే లోటుపాట్లు ఉండడం వల్లనే కేంద్ర ఎన్నికల కమిషన్ దళిత బంధును నిలిపివేసిందని అన్నారు.
ఈటల ఏం సమాధానం చెబుతాడు : విప్ గువ్వల
దళితబంధు నిలిపివేతపై ఈటల రాజేందర్ ఏం సమాధానం చెప్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు. ఇప్పటికే 17 వేల దళితుల కుటుంబాల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయని గుర్తుచేశారు. దళితులపై బీజేపీ నాయకులు కపటప్రేమను చూపిస్తున్నారని, ఓపక్క రాష్ట్రం మొత్తం దళితబంధు ప్రవేశపెట్టాలని సన్నాయినొక్కులు నొక్కుతూ మరోపక్క దళితబంధును ఆపాలని కేంద్రానికి లేఖ రాయడం వారికే చెల్లిందని మండిపడ్డారు. ‘బీజేపీ అంటేనే ఒక బోగస్ పార్టీ. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను దళితవాడల్లో నిలదీయాలి. పథకాన్ని ఎందుకు ఆపారో ప్రశ్నించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
దళితవాడలకు వస్తే తరిమికొట్టాలి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల
ఓట్ల కోసం బీజేపీ నాయకులు దళితుల వాడలకు వస్తే తరిమికొట్టాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మొదటినుంచి దళితుల పట్ల బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని, దళితబంధును ఆపేందుకు దుర్బుద్ధితో కుట్రలు పన్నుతున్నదని అన్నారు. నోటికాడ బుక్కను లాక్కొనేలా వ్యవహరించడం నీచమైన చర్య అని మండిపడ్డారు. ఈటల, బండి సంజయ్ దళితజాతికి సమాధానం చెప్పుకోవాలని, దళితులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల్లో వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధు లెక్క కేంద్రంలో ఓ పథకం పెట్టి దళితులను ఓట్లు అడుక్కోవాలని సవాల్ చేశారు..