మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కారణంగా సినిమాలు చేయలేకపోయాడు మెగాస్టార్. ఆ లోటు ఇప్పుడు భర్తీ చేయాలని ఆలోచిస్తున్నాడు చిరు. అందుకే వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయనపై విమర్శల వర్షం కూడా కురుస్తోంది. దానికి కారణం మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో వరసగా రీమేక్ సినిమాలు చేయడమే. తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు లేనట్లు.. ఇక్కడ అసలు మంచి కథలు రానట్లు.. రీమేక్ సినిమాలు చేయడం ఏంటి అంటూ మెగాస్టార్ను ప్రశ్నించే వాళ్లు కూడా లేకపోలేదు.
ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేస్తున్నాడు మెగాస్టార్. రాబోయే రెండేళ్లలో 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా మే 13న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్లతో బిజీగా మారనున్నాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే లూసిఫర్ రీమేక్ ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు చిరంజీవి. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటించనున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
లూసిఫర్ రీమేక్ కూడా 2021లోనే విడుదల కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత వేదాళం రీమేక్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. మరోవైపు బాబీతో సినిమా 2022 డిసెంబర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంత మంది దర్శకులు లైన్లో ఉండగానే ఈ మధ్య వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి లాంటి కుర్ర దర్శకులు చెప్పిన కథలు కూడా విన్నాడు చిరంజీవి. ఏదేమైనా ఇప్పటినుంచి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. ఈ ప్లాన్ గాని సరిగ్గా వర్కౌట్ అయిందంటే మెగా అభిమానులకు అంతకుమించి పండగ మరొకటి ఉండదు.