హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రయాణికులకు భద్రతపై భరోసా కల్పించేందుకు మొదటిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బయోమెట్రిక్ టోకెన్ యంత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ యంత్రాన్ని ఎస్సీఆర్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వర్రావు, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా సంయుక్తంగా ప్రారంభించారు. ఈ యంత్రంలో ప్రయాణికుడి పేరు, రైలు నంబరు, పీఎన్ఆర్ నంబరు, వెళ్లాల్సిన స్టేషన్ పేరు వంటి వివరాలను నమోదుచేయాలి. తర్వాత ప్రయాణికులకు సంబంధించిన వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. ఆటోమెటిక్గా సీరియల్ నంబర్తో టోకెన్ వస్తుంది. టోకెన్ ప్రకారం ప్రయాణికులు తమకు కేటాయించిన కోచ్లోనే ఎక్కాలి. నేరపూరిత ఘటనలు జరిగితే విచారణకు వేలిముద్రలు ఉపయోగపడుతాయని అధికారులు తెలిపారు. టికెట్ కౌండర్ల వద్ద రద్దీని కూడా ఈ యంత్రం ద్వారా నివారించవచ్చు. త్వరలోనే ఇదే స్టేషన్లో రెండో బయోమెట్రిక్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.