హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా విలయం నుంచి రక్షించే టీకాలకు కొరత ఏర్పడటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటికితోడు తాజాగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా భారత్కు వచ్చింది. ఇందులో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ పూర్తిగా మన దేశంలో తయారైంది. బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్వర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి తయారుచేసిన కొవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నది. స్పుత్నిక్-వీ టీకాను హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తయారుచేస్తున్నది. ఈ టీకాలు జూలై లేదా ఆగస్టులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇవి దేశ అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. మరోవైపు కరోనా కల్లోలం కొనసాగుతున్నది. మూడో వేవ్ భయాలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగు టీకాలు ఆశలు రేపుతున్నాయి. ఇవన్నీ దేశీయంగా తయారవుతున్నవే. ఇందులో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్పై ప్రస్తుతం మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఆగస్టు నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. డిసెంబర్ నాటికి 30 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని బయోలాజికల్-ఈ భావిస్తున్నది. ఇది అందుబాటులోకి వస్తే దేశీయంగా తయారైనా మొదటి మూడు టీకాల్లో ఒకటిగా నిలువనున్నది.
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న టీకా ఇది. కరోనా వైరస్ ముక్కు, గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నది. వాటిద్వారానే ఇతరులకూ సోకుతున్నది. ఈ నేపథ్యంలో ముక్కులో ఉన్న వైరస్ను నాశనం చేసేందుకు భారత్ బయోటెక్ ‘ముక్కు టీకా’ను అభివృద్ధి చేస్తున్నది. దీనిని సులభంగా రవాణా చేయగలగడం, ఎవరికివారే సొంతగా టీకా వేసుకునే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాదే అందుబాటులోకి వస్తుందని అంచనా.
గుజరాత్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడ్లా అభివృద్ధి చేస్తున్న టీకా ‘జైకోవ్-డీ’. ఇప్పటికే ఫేజ్-1, ఫేజ్-2 ట్రయల్స్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. ఫేజ్-3 ట్రయల్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. మొత్తం 30వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు. ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.
మహారాష్ట్రకు చెందిన జెన్నోవా బయోఫార్మా దేశంలోనే మొదటిసారిగా ‘ఎం-ఆర్ఎన్ఏ’ ఆధారిత టీకాను అభివృద్ధి చేస్తున్నది. అమెరికాకు చెందిన మోడర్నా, ఫైజర్ టీకాల తయారీలో సైతం ఈ టెక్నాలజీనే వినియోగించారు. ప్రస్తుతం ఈ టీకా ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నది. మొత్తం 6 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది.
వీటికితోడు అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ ఫార్మా తన కొవాక్స్ టీకాను భారత్లో ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ సహా ఎనిమిది సంస్థలతో చర్చలు జరుపుతున్నది. నొవావ్యాక్స్-సీరం ఇన్స్టిట్యూట్ కలిసి ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.