హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) ఆహ్వానం పలికింది. ఆసక్తిని బట్టి వివిధ పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు అవకాశం కల్పిస్తున్నది. వివిధ పారిశ్రామిక జోన్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లు, షెడ్ల వివరాలను సోమవారం వెల్లడించింది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం వివిధ జిల్లాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఔత్సాహికులు తమ ఆసక్తికి అనుగుణంగా ఎంపికచేసుకున్న పారిశ్రామికవాడలో ప్లాట్లను పొందేందుకు స్థానిక జోనల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్ట్మెంట్ సెల్ను ఏర్పాటుచేయాలని టీఎస్ఐఐసీ యోచిస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో కేంద్రం జాతీయస్థాయిలో ఇన్వెస్ట్మెంట్ సెల్ను నిర్వహిస్తున్నది. ఇదే తరహాలో రాష్ర్టాల్లో నూ ఇన్వెస్ట్మెంట్ సెల్లను ఏర్పాటుచేయాలని ఆకాంక్షిస్తున్నది. సోమవారం ఇన్వెస్ట్ ఇండియా అధికారులు రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసి రాష్ట్రంలోని అవకాశాలను వివరిస్తూ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించాలని కోరింది.