ఈటల ఎపిసోడ్లో వారి పాత్రే కీలకం
గండం నుంచి బయటపడేందుకు నిజాలు వెల్లడించే అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లోని శ్రీ సీతారామస్వామి దేవాలయ భూములపై విచారణ ప్రారంభమైంది. దేవుడి మాన్యాలపై నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన కలెక్టర్ల కమిటీ ఈ భూములకు సంబంధించిన కొత్త, పాత రికార్డులను తవ్వి తీస్తున్నది. దీంతో ఆక్రమణదారులకు బినామీలుగా ఉన్న నాయకులు/రియల్టర్ల వెన్నులో వణుకు మొదలైంది. కమిటీ సభ్యులు మేడ్చల్ జిల్లా పరిధిలోని మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో మొదటి సమావేశం నిర్వహించారు. అనంతరం రెవెన్యూ, ఎండోమెంట్ రికార్డులతోపాటు క్షేత్రస్థాయిలో ఎండోమెంట్ భూమిని పరిశీలించారు. ఐఏఎస్ అధికారుల కమిటీ నియామకం విషయం తెలుసుకున్న బినామీలు సోమవారం మధ్యాహ్నం నుంచి పత్తా లేకుండా పోయినట్టు మేడ్చల్ జిల్లాలో ప్రచారం జరుగుతున్నది.
బినామీలే కీలకం…
దేవరయాంజాల్ దేవాలయ భూముల ఆక్రమణదారుల్లో మాజీ మంత్రి ఈటల, ఓ ఎంపీ (టీఆర్ఎస్ కాదు) అనుచరులతోపాటు బడాబాబులున్నట్టు చెప్తున్నారు. కానీ వారెవ్వరూ తామే యజమానులమని ముందుకొచ్చే పరిస్థితి లేదు. అయితే వారికి బినామీలుగా ఉన్న వ్యక్తులు నెత్తికి చేతులు పెట్టుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ బాధలు మాకెందుకు.. విచారణ అధికారులకు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే ఈ గండం నుంచి బయటపడవచ్చని వారు అభిప్రాయపడుతున్నటు తెలిసింది. బినామీలుగా ఉన్నవారు ఏ చిన్న ఆధారం బయటపెట్టినా అక్రమంగా వెనకేసిన కోట్ల రూపాయల విలువైన భూములు కోల్పోవడం ఖాయం. బినామీలు నోరు తెరిస్తే.. మాత్రం తెరచాటు ఆక్రమణదారుల బండారం బయటకు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మాజీ మంత్రి ఈటలతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఆక్రమణదారుల్లో ఉండటంతో వారు ఈటల పట్ల విపరీతమైన సానుభూతిని చూపుతున్నట్టు సానికులు చర్చించుకుంటున్నారు.