సిద్దిపేట టౌన్, మే 20: కరోనా సోకినవారి వద్దకెళ్లేందుకే వణికిపోతుంటే.. వారిని ఉచితంగా దవాఖానకు తరలిస్తూ ఓ యువకుడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సిద్దిపేటకు చెందిన ఆ యువకుడు ఇందుకోసం తన బైక్నే సింగిల్ బెడ్తో ‘గ్రాంబులెన్స్’గా మార్చాడు. సిద్దిపేటలోని కోటి లింగాలకు చెందిన శశికర్నంద చిన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కరోనాతో సరైన సమయంలో దవాఖానకు వెళ్లలేని వారికోసం సహాయపడాలని సొంత ఖర్చుతో తన బైక్ను ప్రత్యేకంగా రూపకల్పన చేశాడు. డబ్బా మాదిరిగా చేసి.. దానికి చక్రాలను బిగించాడు. అందులో స్ట్రెచర్లాంటిది ఉంచి.. డబ్బాను తనబైక్కు జతచేశాడు. అందులో రోగిని ఉంచి దవాఖానకు తరలిస్తున్నాడు. ఇప్పటివరకు నలుగురు కరోనా బాధితులను దవాఖానలకు తరలించాడు. స్నేహితులతో కలిసి శశికర్నంద సిద్దిపేటలో నిరాశ్రయులు, కరోనా బారినపడిన వారికి 8 రోజులుగా ఉచితంగా ఆహారప్యాకెట్లు అందజేస్తున్నాడు. అన్నార్తులు 9701099969, 9542795467లో సంప్రదించాలన్నాడు.