సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ) : మా దగ్గర పెట్టుబడి పెడితే వంద రూపాయలకు ప్రతి రోజు రూ. 2.5 నుంచి రూ. 4 లాభం ఇస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 5.4 లక్షలు టోకరా వేశారు. శివంరోడ్డులో నివాసముండే రామకృష్ణను ఇటీవల.. తాము స్టాక్ బ్రోకరింగ్ చేస్తామని, తమ వద్ద పెట్టుబడి పెడితే భారీ లాభాలిస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లో సంప్రదించారు. ఆ తరువాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు ఎలా సంపాదిస్తామో చూడండంటూ అతనికి మాటలు చెప్పి బుట్టలో వేశారు. వాళ్ల మాటలు విన్న బాధితుడు.. దఫదఫాలుగా రూ.5.4లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. తరువాత లాభాలిస్తామంటూ నమ్మించి సెల్ఫోన్లు స్విచాఫ్ చేశారు. దీంతో బాధితుడు శనివారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.