హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): శాసనమండలి చైర్మన్ ప్రొటెమ్గా ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం గురువారంతో ముగుస్తుంటంతో ప్రభుత్వం ప్రొటెమ్ చైర్మన్ను నియమించింది. శుక్రవారం (జూన్ 4) నుంచి భూపాల్రెడ్డి చైర్మన్ ప్రొటెమ్ హోదాలో కొనసాగుతారని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు వెల్లడించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్చెరు నియోజకర్గంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన వెన్నవరం భూపాల్రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మూడుసార్లు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన భూపాల్రెడ్డి.. జిల్లా పరిషత్ పంచాయతీ సమితి కో-ఆప్షన్ సభ్యుడి స్థాయి నుంచి ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఆయన అనేక కార్యక్రమాలను నిర్వహించారు. సొంత నిధులతో రామచంద్రాపురంలో జూనియర్ కాలేజీని నిర్మించారు. అనంతరం ఆ కాలేజీకి ప్రభుత్వం వీ గీతాభూపాల్రెడ్డి జూనియర్ కాలేజీగా నామకరణంచేసింది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 200 మంది వృద్ధులు, వితంతువులకు ఫించన్ పంపిణీచేశారు. 1947 మే 1న జన్మించిన భూపాల్రెడ్డి పీయూసీ వరకు చదివారు. తనను శాసనమండలి చైర్మన్ ప్రొటెమ్గా నియమించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు భూపాల్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞక్షతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఆయన పేర్కొన్నారు.
శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్గా నియమితులైన భూపాల్రెడ్డి గురువారం జూబ్లీహిల్స్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సుఖేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్చైర్మన్ నేతి విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరి పదవీకాలం గురువారంతో ముగియడం.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో మంత్రి ప్రశాంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు.