తూప్రాన్ రూరల్, మే 18 : గ్రామాల్లో నిర్మించిన పల్లెప్రకృతి వనాలు ప్రజలకు భవిష్యత్లో దోహదపడుతాయని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తూప్రాన్ మండలం యావాపూర్లో రూ.5లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని మంగళవారం ఎంపీడీవో అరుంధతి, ఈజీఎస్ ఏపీవో సంతోశ్రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను చూసి మంత్రముగ్ధులయ్యారు. మండలంలో ఎన్ని గ్రామాల్లో నిర్మించారు..? ఏయే గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి..? అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. దీంతో ఎంపీడీవో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పూర్తయ్యాయని సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పకృతి వనాలను నిర్మించడానికి ఒక్కొక్క గ్రామానికి ప్రభుత్వం రూ.లక్షల్లో ఖర్చు పెడుతుందన్నారు. మొక్కల మధ్య నడువడానికి వీలుగా వాకింగ్ ట్రాక్ను నిర్మించడంతో గ్రామాల్లోని యువతీ, యువకులు, వృద్ధులు వ్యాయామం చేయడానికి, తీరిక వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. యావాపూర్లో నిర్మించిన పల్లెప్రకృతి వనం పనులు బాగున్నాయన్నారు. ఆయన వెంట సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ లక్ష్మీస్వామి, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.