హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేతలకు బీమా సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా తరహాలోనే దీనినీ పకడ్బందీగా అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఏడెనిమిది రోజుల్లో అతడి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ.5 లక్షల పడుతున్నాయని.. అంత చక్కటి పద్ధతిలో రైతుబీమా అమలవుతున్నదని పేర్కొన్నారు. మాజీమంత్రి ఈ పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇటీవల సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పిన. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినం. రైతుబీమా చాలా చక్కటి పద్ధతిలో ఉన్నది. రైతుచనిపోతే ఏడెనిమిది రోజుల్లో రూ.5 లక్షలు ఆ రైతు కుటుంబం అకౌంట్లో పడుతున్నయి. ప్రభుత్వం బీమాచేస్తే రైతుబీమా మాదిరిగానే మాకు కూడా సాయమందుతుందని అందరూ ఆశిస్తున్నరు. దళిత సోదరుల్లో చాలామంది పేదలు ఉన్నరు కాబట్టి వారికి కూడా బీమా సదుపాయం కల్పించాలని ఇటీవల చక్కటి సూచన చేసిన్రు. ఇది చేయడానికి కొంతటైం పడుతది. రైతు బంధుగానీ, రైతు బీమాగానీ చేపట్టడానికి సుమారు ఏడాదికాలం పట్టింది. ప్రతిఐదువేల ఎకరాలకు ఒకక్లస్టర్ ఏర్పాటు చేసి.. సుమారు మూడువేల మంది ఏఈవోలను నియమించి రైతుల వివరాలను జాగ్రత్తగా సేకరించినం. దీంతో రైతు చనిపోతే నిమిషాల మీద రిపోర్ట్ చేస్తున్నరు. 10 రోజుల్లోపలే బీమా అందుతున్నది. ఇలాంటి సిస్టమే మీశాఖలోనూ ఇంప్లిమెంట్ చేద్దామని చేనేత మంత్రికి చెప్పిన. చేనేతశాఖ కార్యదర్శి, ఇతర అధికారులంతా ఆ పనిలో తలమునకలై ఉన్నరు. రాబోయే కొద్దిరోజుల్లో ఆ స్కీం మన ముందుకొస్తది. దళిత సంక్షేమశాఖలోనూ ఆ విధమైన ఏర్పాట్లుచేస్తే ఆ సోదరులకు కూడా బీమా ఏర్పాటు చేసుకుందామని మంత్రి కొప్పుల ఈశ్వర్గారికి చెప్పిన.
దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఆర్థికంగా వెనుకబడిన, సామాజిక వివక్షకు గురైన, సంక్షేమ ప్రగతిఫలాలను అందుకోలేని పరిస్థితిలో ఉన్నవారికోసం పకడ్బందీగా కార్యక్రమాలను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మన రాష్ట్రంలోలాగా పథకాలు దేశంలో ఎక్కడా అమలుకావడం లేదు. ఉన్నా అరకొరగా ఉంటయి. ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రం సాధించుకోకముందు ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నడో మనకు తెలుసు. రాష్ట్రం వచ్చాక నేనే సిపాయినంటే.. నేనే సిపాయినంటూ రకరకాల పార్టీలు, వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నరు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో మనం అనేక కార్యక్రమాలను ఆవిష్కరించినం. కొన్ని కార్యక్రమాలైతే ప్రపంచంలోనే ఎక్కడాలేవు. ఒక కార్యక్రమాన్ని ఏదో హడావుడిగా, తమాషాగా తీసుకోవద్దు. ఒక ఫలితం, ప్రయోజనం ఆశించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
రెండుపూటల తిని, జాగ్రత్తగా ఉండేలా పెన్షన్
2014 ఎన్నికల కంటే ముందు చాలామందికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తదని నమ్మకంలేదు. కానీ తప్పకుండా వస్తది.. ఎవడూ ఆపలేడని చెప్పిన. అధికారంలోకి వచ్చాక మనమేం అమలుచేస్తమో మ్యానిఫెస్టో తయారుచేయాలని చెప్పిన. కడియం శ్రీహరి మ్యానిఫెస్టో కమిటీ బాధ్యతలు చూస్తుండగా.. మాజీ ఐఏస్అధికారి ఏకే గోయల్ టీఆర్ఎస్ పొలిట్బ్యూరో మెంబర్గా ఉన్నారు. మ్యానిఫెస్టో గురించి చర్చిస్తుండగా పేదలకు పెన్షన్ల విషయం ప్రస్తావనకు వచ్చింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.200 పింఛన్ ఏం సరిపోతది? వారు ఎవరినీ అడుక్కోకుంటా రెండుపూటలు తిని పండుకుంటే చాలు అని ఏకే గోయల్కు చెప్పిన. ఆయన బియ్యానికింత.. నూనెకింత.. చింతపండుకింత.. పప్పుకింత.. పులుసుకింత అని లెక్కవెట్టి రూ.670 అయితే సరిపోతది సార్ అని చెప్పిండు. ‘పేదోళ్లకు కొసురాల్నా.. వెయ్యి రూపాయలు పెట్టు.. దేవుడు కరుణిస్తే మళ్లా పెట్టుకుందాం కానీ’.. అని చెప్పి రూ.వెయ్యి పెన్షన్ ప్రకటించిన.