న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు విధిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లబ్ధిదారులకు మరో రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. మహమ్మారి వెంటాడుతుండటంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిన నేపథ్యంలో జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారులకు మే, జూన్ మాసాల్లో ఆహార ధాన్యాలను అందించాలని కేంద్రం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా 79.88 కోట్ల లబ్ధిదారులకు వ్యక్తికి నెలకు ఐదు కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఇటీవల నిర్ణయించింది. కరోనా మహమ్మారితో ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవడం, అకాల వర్షాలు, తుపాన్లు వంటి పలు విపత్తులు ఎదురైనందున లబ్ధిదారులకు మరో రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించామని ఆహార, ప్రజా పంపిణీ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.