సత్వరమే పనులు పూర్తి చేసి
రైతులకు సాగునీరు అందిస్తాం
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, మే 27: ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేశ్యకాంతల చెరువు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జలవనరుల శాఖ అధికారులతో కలిసి వేశ్యకాంతల చెరువును గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేశ్యకాంతల చెరువుకు అవసరమైన రెండు తూముల మరమ్మతులు, పంట కాలువల సైడ్వాల్వుల పనులను వెంటనే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఈ పనుల కారణంగా చెరువు ఆయకట్టు పరిధిలో 500 ఎకరాల మేరకు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. రాబోయే వానకాలం పంటల సీజన్ నాటికి చెరువు పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ సీఈ శంకర్నాయక్, ఎస్ఈ ఆనంద్కుమార్, డీఈ మరియన్న, జేఈలు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, నాయకులు నరుకుళ్ల శ్రీనివాసరావు, చల్లగుళ్ల నర్సింహారావు, రాయప్ప, అమరవరపు కృష్ణారావు, చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధితులకు ‘ఊపిరి’
రూ.5 లక్షల చెక్కు ఎమ్మెల్యే సండ్రకు అందజేసిన సింగరేణి అధికారులు
కరోనా బారిన పడి పెనుబల్లి, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు సింగరేణి అధికారులు ముందుకురావడం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ విషయమై సింగరేణి సీఎండీ శ్రీధర్, ఖమ్మం కలెక్టర్ కర్ణన్లతో చర్చించి నిత్యం కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు గుర్తుచేశారు. ఈ మేరకు సింగరేణి అధికారులు స్పందించి రూ.5 లక్షల చెక్కును అందజేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికే సత్తుపల్లి, పెనుబల్లి ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులూ లేకుండా అందరికీ వైద్యం, ఆక్సిజన్, పౌష్టికాహారం, మినరల్ వాటర్ అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుమతిదేవి, సింగరేణి జీఎం నర్సింహారావు, పీవో వెంకటాచారి, వెల్ఫేర్ ఆఫీసర్ సంతోశ్కుమార్, టీబీజీకేఎస్ నాయకులు జేఎస్ఆర్ మూర్తి, చెన్నకేశవరావు, చారి పాల్గొన్నారు.