మెదక్,జూన్17: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వికసించేలా అధికారులు చిత్తశద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మండల ప్రత్యేకాధికారులు , ఎంపీడీవోలు, ఎంపీపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు, గ్రామ రహదారుల వెంట పలు వరుసల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా నుంచి వెళ్లే మూడు జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ఆయా అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా డీఎఫ్వో కు సూచించారు. జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటేందుకు ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు గుంతలు సి ద్ధంగా ఉంచుకోవాలన్నారు.కానీ, ఇంకా క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ పారిశుధ్యం లోపించిందని , పచ్చదనం కొరవడిందని, ఆ గ్యాప్ను పూర్తి చేయాలన్నారు. త్వ ర లో తాను, రాష్ట్రస్థాయి నుండి ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించినప్పుడు ఆశించిన స్థాయిలో లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులు, పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి వంద శాతం పనులు పూర్తి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలన్నారు. నిరుపయోగమైన బోరుబావులను పూడ్చి వేయాలని, అలా కాని పక్షంలో బావుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, శుభ్రం చేయాలని పాడుబడిన భవనాలను నేల మట్టం చేసి శిథిలాలను తొలిగించాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రగతి నివేదికలు అంద జేయాలని అన్నారు. మిగిలిపోయిన వైకుంఠధామాలను పది రో జుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి మొక్కకు లెక్క ఉంటుందని, కాబట్టి పంపిణీ సక్రమంగా జరిగేల చూడాలని, గత హరితహారంలో నాటగా ఎండిపోయిన మొక్కలు తొలిగించాలన్నారు. పచ్చదనం కొరకు బడ్జెట్ లో కేటాయిస్తున్న 10శాతం నిధులు ఇందుకే ఖర్చు చేయాలని సూచించారు. మండలంలో ఉత్తమంగా ఉన్న ఐదు నర్సరీల జాబితా అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ సీఈవో శైలేష్. డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, డీఎఫ్వో జ్ఞానేశ్వర్ ఉన్నారు.