హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు తగ్గిన వెంటనే సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 2019లో మాదిరిగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో 516 కేసులు హైదరాబాద్లోనే వెలుగుచూశాయని వివరించారు. రెండు నెలలుగా టైఫాయిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉన్నదని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో తగిన మందులు ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలు డెంగ్యూ చికిత్స విషయంలో ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకోవద్దని కోరారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాష్ట్రంలో ఆరు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, హైరిస్క్ గ్రూప్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గిందని, రానున్న రోజుల్లో సాధారణ ఫ్లూ మాదిరిగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే సీజనల్ ఫీవర్ క్యాటగిరీలోకి చేరిందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని తెలిపారు. భవిష్యత్తులో బలమైన వేరియంట్ వస్తే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ సూచనలు
టైఫాయిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాలు
ఆదిలాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, నాగర్కర్నూల్, నల్లగొండ, భూపాలపల్లి