హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో సింగరేణి కార్మికులను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకునేలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కోల్బెల్ట్ ప్రాంతాలు, బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడం, కొవిడ్ బారిన పడిన కార్మికులు, ఉద్యోగుల్లో భరోసా నింపడంపై ఆమె దృష్టిసారించారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు మొదలుకొని క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వరకు అన్ని దశల్లో విశేష కృషి చేస్తున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. రూ.316 కోట్లతో 1.10 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేయించి భారీ ఎత్తున పరీక్షలు చేయిస్తున్నారు. 27 వేల మందికి టీకాలు ఇప్పించారు. 1,400 బెడ్లతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఈ వార్డులతోపాటు ఐసొలేషన్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలతో ఇప్పటికే 9,650 మంది పూర్తిగా కోలుకోవటం విశేషం. ప్రస్తుతం సింగరేణిలో యాక్టివ్ కేసులుగా ఉండి వైద్యం పొందుతున్న కార్మికుల సంఖ్య కేవలం 560 మాత్రమే. మరోవైపు కరోనా తీవ్రంగా ఉన్నవారిలో 862 మందికి హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు సింగరేణి యాజమాన్యం దాదాపు రూ.38 కోట్లు ఖర్చుచేసింది. కరోనాతో మృతిచెందిన 39 మంది కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించింది.