డిజిటల్ పాఠాలతో మెరుగైన ఫలితాలు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు అంగన్వాడీ ప్రీస్కూల్స్లో ప్రవేశపెట్టిన డిజిటల్ క్లాసులు తోడ్పడుతున్నాయని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్ తెలిపారు. కరోనా కారణంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయని పరిస్థితుల్లో ప్రీస్కూల్ వయసు పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు తమ శాఖ ప్రత్యేకపోర్టల్ రూపొందించిందని పేర్కొన్నారు. గురువారంతో ప్రీస్కూల్స్లో డిజిటల్ కార్యక్రమాలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా టీ శాట్లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు డిజిటల్ తరగతుల నిర్వహణపై శిక్షణ ఇప్పించి ప్రీ స్కూల్ విద్యార్థుల కోసం కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. చర్చాగోష్ఠిలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ జేడీ లక్ష్మి తదిరులు పాల్గొన్నారు.