మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలో 90 సిలిండర్లు
తూప్రాన్, నర్సాపూర్ దవాఖానల్లో 30 చొప్పున సిలిండర్లు
అందుబాటులో 140 ఐసీయూ బెడ్లు, 3 వెంటిలేటర్లు
కరోనా రోగులకు రందిలేకుండా ఏర్పాట్లు
చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్
మెదక్, ఏప్రిల్ 25 : ఈ భూమ్మీద ప్రతి జీవి మనుగడకు ఆక్సిజన్ ఎంతో అవసరం.కరోనా విజృంభిస్తున్న వేళ మెడికల్ ఆక్సిజన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఉత్తరాదిన సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేక దవాఖానల్లో రోగులు పిట్టల్లా రాలిపోతుండడం కొద్దిరోజులుగా కండ్ల ముందు చూస్తున్నాం.మన వద్ద అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో 90 సిలిండర్ల ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ అందజేస్తున్నారు. నర్సాపూర్ ఏరియా దవాఖానలో 30 సిలిండర్లు, తూప్రాన్ సీహెచ్సీ సెంటర్లో 30 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలో ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 140 బెడ్లు ఉండగా, అందులో 90 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. కేవలం 10 బెడ్లు మాత్రమే ఐసీయూకు వినియోగిస్తున్నారు.
మెదక్ ఐసీయూలో 140 బెడ్లు.. 3 వెంటిలేటర్లు
మెదక్లోని ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 140 బెడ్లు ఉండగా, అందులో 90 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. కేవలం 10 బెడ్లు మాత్రమే ఐసీయూకు వినియోగిస్తున్నారు. జిల్లాలో కరోనా రోగులకు మెదక్ ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. మెదక్ దవాఖానలో 3 వెంటిలేటర్లు, నర్సాపూర్ ఏరియా దవాఖాలో ఒక వెంటిలేటర్లు ఉన్నాయి. కరోనా రోగికి డయాలసిస్ అవసరముంటే వెంటనే జిల్లా కేంద్ర దవాఖానలోని డయాలసిస్ సెంటర్లో సేవలు అందిస్తున్నారు. మొ త్తం 5 డయాలసిస్ మిషన్లు పనిచేస్తున్నాయి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లా కేంద్ర దవాఖానలో 100 మందికి చికిత్స అందించగా, 60 మందికి ఆక్సిజన్ అందించారు. నలుగురు మృతిచెందారు.
సిద్దిపేటలో ఆక్సిజన్ కొరత లేదు
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 25 : కరోనా విజృంభిస్తుండడంతో సిద్దిపేట జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు డీఎంహెచ్వో మనోహర్ తెలిపారు. మొత్తం 350 పడకల్లో ఆక్సిజన్ సపోర్టు బెడ్లుగా మార్చుతున్నామన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 150, సురభి వైద్య కళాశాలలో 50, ఆర్వీఎం వైద్య కళాశాలలో 100, నంగునూరు దవాఖానలో 50 మొత్తం 350 ఆక్సిజన్ సపోర్టు బెడ్లుగా మార్చుతున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే ప్రైవేటు దవాఖానల్లోనూ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు.
ఆయువు పోసే ప్రాణవాయువు..
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు పీహెచ్సీలతో పాటు కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో అవసరమైనన్ని బెడ్లు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానలో 500 బెడ్లు కరోనా రోగుల చికిత్స అందించేందుకు సిద్ధ్దంగా ఉంచారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేదు. కరోనా రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైతే అందించేందుకు వీలుగా వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానలో ప్రభుత్వం రోగుల కోసం ఆక్సిజన్ ప్లాం టును ఏర్పాటు చేసింది. సంగారెడ్డి దవాఖానలో ఆక్సిజన్ ప్లాంటులో 3000 లీటర్లు ఆక్సిజన్ అందుబాటులో ఉంది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరులోని దవాఖానల్లో సైతం ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 600 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు 20 యూనిట్ల చొప్పున అందుబాటులో ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్ కొరతలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి గాయత్రీదేవి తెలిపారు.