పెద్దపల్లి, మే 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీట్ను పోలీసులు మంథని కోర్టులో సమర్పించారు. కేసు విచారణ అధికారి డీసీపీ(అడ్మిన్) అశోక్కుమార్ మంథని ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం చార్జిషీట్ కాపీని సమర్పించారు. ఈ కేసులో ఇప్పటికే ఏ-1గా మంథని మండలం గుంజమడుగుకు చెందిన కుంట శ్రీనివాస్, ఏ-2గా శివందుల చిరంజీవి, ఏ-3గా అక్కపాక కుమార్, ఏ-4గా బిట్టు శ్రీనివాస్, ఏ-5గా ఊదరి లచ్చయ్య, ఏ-6గా కాపు అనిల్, ఏ-7గా ఉన్న వెల్ది వసంతరావును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఇందులో ఏ1, ఏ2, ఏ3 నిందితులను అరెస్టు చేసి దాదాపుగా మూడు నెలలు కావస్తున్నది. ఈ హత్య కేసుతో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ ప్రమేయం ఉన్నదని ఆరోపిస్తూ గట్టు వామన్రావు తండ్రి కిషన్రావు హైకోర్టును ఆశ్రయించడంతోపాటు, ఈస్ట్ జోన్ ఐజీ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణను పోలీసులు విచారించారు. మరోవైపు బెయిల్ కోసం కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ మంథని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను మెజిస్ట్రేట్ తిరస్కరించారు.