తెలంగాణ సారస్వత పరిషత్తు సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 9: తమ రచనలు, కళల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత కవులు, కళాకారుల మీద ఉన్నదని పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో పలువురు సాహితీవేత్తలకు సాహిత్య పురస్కారాలు అందజేసి, సత్కరించారు. కథా ప్రక్రియలో కేవీ నరేందర్, విమర్శలో కేపీ అశోక్కుమార్, ఇతర ప్రక్రియలలో అన్నవరం దేవేందర్కు పురస్కారాలు అందజేశారు. వచన కవిత్వంలో నాగరాజు రామస్వామి తరపున తుమ్మూరి రామ్మోహన్రావు, నవలా ప్రక్రియలో పరవస్తు లోకేశ్వర్ తరపున రాపోలు సుదర్శన్ పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, కవులు వేణు సంకోజు, డాక్టర్ దామెర రాములు, సాహితీవేత్త ఐతా చంద్రయ్యకు వరిష్ట పురస్కారం, తగుళ్ల గోపాల్కు యువ పరస్కారం అందజేశారు. కార్యక్రమంలో పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి, మంత్రి రామారావు పాల్గొన్నారు.