హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): దేశంలో 2-15 ఏండ్ల వయసు పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పిల్లలకు కరోనా వల్ల ప్రమాదం ఉంటుందా? వారికి టీకాలు అవసరమా? టీకాలు వేస్తే భవిష్యత్తులో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఎక్కడైనా పిల్లలకు టీకాలు వేస్తున్నారా? ఇలాంటి సందేహాలు ఎన్నో తలెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు వైద్యనిపుణులను సంప్రదించగా.. పిల్లలకు కూడా టీకాలు వేయించాల్సిందేనని సమాధానమిస్తున్నారు. అయితే ఎంత మోతాదులో వేయాలి అనేది మాత్రం క్లినికల్ ట్రయల్స్లో తేలుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అమెరికాలో పిల్లలకు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్లో నమోదవుతున్న కేసుల్లో 24% వరకు 18 ఏండ్లలోపు వారే. ఇందులో కొన్నివారాల పసికందులూ ఉన్నారు. అయితే వారికి రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండటంతో కోలుకుంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా.. పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తే.. కరోనా పిల్లలపైనే ఎక్కువగా దాడి చేస్తుందని అంచనా. కాబట్టి పిల్లలకు కరోనా ముప్పు పూర్తిగా తొలగాలంటే టీకాలు వేయాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతరులకు వైరస్ను పిల్లలు అంటించే అవకాశం కూడా ఉండదు. దీంతో వారిని స్వేచ్ఛగా పాఠశాలలకు పంపించవచ్చు. ఆహ్లాదకర వాతావరణం మధ్య వారు విద్యను అభ్యసించగలుగుతారు. దీంతోపాటు అందరికీ వ్యాక్సినేషన్ అన్న కేంద్రప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.
అమెరికాలో 12-15 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఫైజర్ టీకాకు అనుమతులు వచ్చాయి. మార్చిలో 2,260 మంది చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిపారు. అమెరికా ప్రభుత్వం ఈ నివేదికలను పరిశీలించి 12-15 ఏండ్ల మధ్యవారికి టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఆరునెలల వయసు నుంచి 18 ఏండ్లలోపు వారికి వ్యాక్సిన్ ప్రయోగాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నదని ఆరోపణలు రావడంతో ట్రయల్స్కు బ్రేకులు పడ్డాయి. తాజాగా తిరిగి ప్రారంభించారు. ఒకటి రెండు నెలల్లో ఫలితాలు వస్తాయని అంచనా. మరోవైపు మోడర్నా మూడునెలల కిందట 6,750 పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది.
పిల్లలందరిలో వ్యాధి నిరోధకశక్తి సమానంగా ఉండదు. అదేవిధంగా వయసును బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి వారిని క్యాటగిరీలుగా విభజించి తగినస్థాయిలో టీకా ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం రెండోడోస్కు ఒక్కో కంపెనీ టీకాకు ఒక్కోరకం గడువు ఉన్నది. పిల్లల్లో ఇది మారవచ్చని పేర్కొంటున్నారు.