పటాన్చెరు, మే 12 : పటాన్చెరు నియోజకవర్గం లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తం గా లాక్డౌన్ను విధించడంతో పటాన్చెరు నియోజకవర్గంలో బుధవారం ఉదయం 10 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉన్నాయి. పారిశ్రామికవాడల్లోని రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. పరిశ్రమల్లో నిబంధనల మేరకు ఉత్పత్తులు జరిగాయి. ఫార్మ, ఆహారరంగ పరిశ్రమలు నిరాటకంగా నడిచాయి. ఉదయం సమయంలో లాక్డౌన్ లేకపోవడంతో కార్మికులు తెలిగ్గానే పరిశ్రమలకు చేరుకున్నారు. సాయంత్రం సమయంలో కార్మికులకు పోలీసులు ఐడీ కార్డులు పరిశీలించి పంపించారు. పటాన్చెరు, రామచంద్రాపురం, బొల్లారం, తెల్లాపూర్లో వీధుల్లో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
పోలీసుల విస్తృత తనిఖీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్లో భాగంగా మొదటి రోజు ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు అన్నీ వాణిజ్య, వ్యాపార సంస్థలు తెరిచి పది తర్వాత అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆ తర్వాత పోలీసులు సంగారెడ్డి పట్టణంతో పాటు చౌరస్తా, కంది వద్ద భారీకేడ్లను ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి పట్టణంతో పాటు కంది వద్ద స్థానిక డీఎస్పీ బాలాజీ లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పరిశీలించారు. తనిఖీల్లో సీఐలు శివలింగం, రమేశ్, ఎస్ఐలు సుభాక్, రాజేశ్ నాయక్తో పాల్గొన్నారు.
కంది పీహెచ్సీలో వైద్య సేవలు…
కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుం చి 4 గంటల వరకు స్థానిక ప్రజలకు వైద్య సేవలను అందించారు. కొవిడ్ లక్షణాలతో వచ్చిన వారికి మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 15 వరకు గతంలో తీసుకున్న వారికి రెండో వ్యాక్సిన్ డోస్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అలాగే, 15 తర్వాత ప్రభుత్వ సూచనల మేర కు మిగతా వారికి కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తామన్నారు.
ప్రశాంతంగా లాక్డౌన్
మండల వ్యాప్తంగా లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. మొదటి రోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉన్నాయి. 11 గంటల తరువాత రోడ్లు, గ్రామాలన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి.
నిర్మానుష్యంగా మారిన రోడ్లు
మున్సిపాలిటీ పరిధిలో లాక్డౌన్ను పక్కాగా అమలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపార సముదాయాలు బుధవారం ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంచారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ నిత్యావసర సరుకులను తీసుకెళ్లారు. పది గంటల తర్వాత దుకాణా సముదాయాలు అన్ని మూసి వేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు బయటకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
మూతపడిన వర్తక, వాణిజ్య సముదాయాలు
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సదాశివపేటలో ప్రారంభమైంది. సదాశివపేట పట్టణంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. పట్టణంలో నిత్యం ప్రజలతో కళకళలాడే గాంధీ చౌక్ ప్రజలు లేకబోసిపోయింది. సదాశివపేట పోలీసులు జాతీయ రహదారితో పాటు పట్టణ ప్రధానదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్లపై పర్యవేక్షణ నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆపి లాక్డౌన్కు సహకరించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బస్సులు డిపోలకే పరిమితం
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు మేరకు ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగించి అనంతరం దుకాణాలను మూసివేశారు. ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు భెల్ డిపోకు వచ్చి చేరాయి. ప్రజలు ఉదయం 10 గంటల వరకు వారి కార్యకలాపాలను నిర్వహించుకుని ఇండ్ల కు చేరుకున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
పారిశ్రామికవాడలో నిర్మానుష్యంగా రోడ్లు
కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం మండలం కేంద్రమైన గుమ్మడిదల, పారిశ్రామిక గ్రామాలైన బొంతపల్లి, దోమడుగు, అన్నారం ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఎస్సై విజయకృష్ణ తన సిబ్బందితో కలిసి జాతీయ ప్రధానరహదారిపై వాహనాలను తనిఖీలు నిర్వహించారు.
అమీన్పూర్ మే 12 : కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో అమీన్పూర్లో బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపారస్తులు ముందస్తుగానే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు మూడు రోజులగా స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ను ఇంకా కఠినంగా పాటిస్తున్నారు. దీంతో అమీన్పూర్ మున్సిపల్, మండల పరిధిలో అన్ని కాలనీలు, గ్రామాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.