హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం ఆసరాతో పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసుకుంటామని హూజూరాబాద్కు చెందిన లబ్ధిదారులు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య గురువారం నిర్వహించిన వెబినార్లో హుజూరాబాద్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ జీవితాలను బాగుచేయాలని కంకణం కట్టుకున్నారని, డబ్బులు జమ చేయటం, యూనిట్లు గ్రౌండింగ్ కావడంతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు. తమ అనుమానాలను అధికారులు ఒకటికి పదిసార్లు నివృత్తి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు వెబినార్లో పాల్గొన్నారు. గుండపల్లె గ్రామం నుంచి పాండు, మల్యాల నుంచి సదానందం, ఇల్లంతకుంట నుంచి కనుమల్ల గణపతి, ఈర్ల రమేశ్, శ్రీకాంత్, భిక్షపతి, రిటైర్డ్ ఉద్యోగి సంపత్రావు తదితరులు మాట్లాడారు. నియోజకవర్గంలో గతంలో 30 ఎకరాల భూమిని లెదర్పార్కుకు ప్రభుత్వం కేటాయించిందని, అదేచోట కొంతమంది దళితులు గ్రూప్గా ఏర్పడి పరిశ్రమను నెలకొల్పితే దాదాపు 200 కుటుంబాలకు శాశ్వత ఉపాధి లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళదామని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేయటానికి ప్రభుత్వానికి సహాయకారిగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ పనిచేస్తుందని చెప్పారు. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఉన్న అనుమానాలన్నీ క్రమక్రమంగా పటాపంచలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజల పట్టుదల రాష్ట్రంలోని మిగతా దళిత సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పారు. హుజూరాబాద్ దళితుల పట్టుదలపై దేశమంతా ఆసక్తి నెలకొన్నదని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాన్ని లబ్ధిదారులు అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆయన కోరారు.